గాంధీజీ బోధనలు నేటికీ అనుసరణీయం
Published Saturday, 30 April 2016పోర్ట్ మోరెస్బి, ఏప్రిల్ 29: అసహనం, తీవ్రవాదం జాడ్యాలతో సతమతమవుతున్న ప్రపంచానికి నేటికీ మహాత్మాగాంధీ బోధనల ఆవశ్యకత ఎంతయినా ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవం వంటి నిజమైన విలువలు నేటికీ అనుసరణీయమని ఆయన అంతర్జాతీయ సమాజానికి గుర్తుచేశారు. శుక్రవారం ఇక్కడ యూనివర్శిటి ఆఫ్ పపువా న్యూ గునియా (పిఎన్జి) విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ గాంధీజీ సమానత్వం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని, ప్రజలందరి వ్యక్తిగత స్వేచ్ఛ గురించి బోధించారని తెలిపారు. శాంతి శిఖరం, అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించి ఆచరించిన మహాత్మాగాంధీ ప్రపంచ వ్యాప్తంగా ఆరాధనీయుడని ఆయన అన్నారు. గాంధీజీ జీవితం, ఆయన ఇచ్చిన సందేశం.. సత్యం, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పిఎన్జిని సందర్శించిన తొలి భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీయే. తన ఈ పర్యటన చరిత్రాత్మకమైనదని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. 1997లో ఈ యూనివర్శిటి క్యాంపస్లో నెలకొల్పిన గాంధీజీ విగ్రహం వద్ద తొలుత రాష్టప్రతి నివాళి అర్పించారు. నేర్చుకోవడానికి- నిజమైన విద్యకు, జ్ఞానానికి- నిజమైన వివేకానికి, అక్షరాస్యతకు- జీవితం నుంచి నేర్చుకునే నిజమైన పాఠాలకు మధ్య తేడాలను గాంధీజీ నొక్కి చెప్పారని ఆయ న వివరించారు. భారత్లో తాము జాతీయ ప్రణాళికలు, మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో లక్ష్యాలను సాధించేందుకు ఈ సూత్రాలను అవలంబించడానికి ప్రయత్నించామని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. పసిఫిక్ మహాసముద్ర ద్వీపకల్ప దేశాలతో తనకున్న సన్నిహిత స్నేహసంబంధాలకు భారత్ అత్యంత విలువ ఇస్తుందని ఆయన అన్నారు. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో పిఎన్జికి కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్ర ద్వీపకల్ప దేశాలతో సన్నిహిత సహకారానికి పిఎన్జిని సింహద్వారంగా అభివర్ణించారు.