కంచి శంకరాచార్య నిర్దోషి
Published Saturday, 30 April 2016చెన్నై, ఏప్రిల్ 29: ఆడిటర్ రాధాకృష్ణన్పై దాడి కేసులోనుంచి కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి, మరో ఎనిమిది మంది నిర్దోషులుగా బయటపడ్డారు. 2002నాటి ఈ కేసులో హత్యాయత్నం సహా అన్ని అభియోగాల నుంచి వారు నిర్దోషులుగా బయటపడ్డారు. ప్రథమ అదనపు సెషన్స్ న్యాయమూర్తి పి.రాజమణిక్కం శుక్రవారం వెలువరించిన తన సంక్షిప్త తీర్పులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. కిక్కిరిసి ఉన్న కోర్టులో తన ముందు హాజరయిన నిందితులను ఉద్దేశించి ‘నేను మిమ్మల్ని నిర్దోషులుగా ప్రకటిస్తున్నాను. మీరు వెళ్లిపోవచ్చు’ అని న్యాయమూర్తి రాజమణిక్కం అన్నారు. అప్రూవర్గా మారి మళ్లీ ఎదురుతిరిగిన రవి సుబ్రమణియన్ను విడిగా విచారిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఆడిటర్ రాధాకృష్ణన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడయిన 80 ఏళ్ల జయేంద్ర సరస్వతి, కంచి మఠం మేనేజర్ సుందరేశ ఐయ్యర్, విజయేంద్ర సరస్వతి సోదరుడు రఘు ప్రధానంగా నేరపూరిత కుట్ర, హత్యాయత్నం, హత్యాయత్నానికి ప్రోత్సహించటం అభియోగాలను ఎదుర్కొన్నారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. చెన్నైలోని తన ఇంట్లో ఉన్న కంచి మఠం మాజీ ఆడిటర్ రాధాకృష్ణన్పై 2002 సెప్టెంబర్ 20న ఒక ముఠా దాడికి పాల్పడింది. కంచి మఠంలో జరిగినట్లు భావిస్తున్న అక్రమాలను వెల్లడిస్తూ సోమశేఖర గణపడిగల్ పేరుతో రాధాకృష్ణన్ లేఖలు రాశారని భావించిన నిందితులు ఆయనపై దాడికి కుట్ర పన్నారనేది ప్రాసిక్యూషన్ వారి అభియోగం. సోమశేఖర్ గణపడిగల్ పేరిట వెలువడిన లేఖలపై విసుగుచెందిన జయేంద్ర సరస్వతి.. వీటి గురించి ఏమైనా చేయాలని సుందరేశ ఐయ్యర్, రఘులను ఆదేశించిన తరువాత రాధాకృష్ణన్పై దాడి జరిగినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. జయేంద్ర సరస్వతి సహా మొత్తం 12మందిపై పోలీసులు 2006లో కేసు నమోదు చేశారు. కేసు విచారణ దశలో ఉండగానే ఇద్దరు నిందితులు మృతి చెందారు. అయితే ప్రాసిక్యూషన్ వారు తనపై మోపిన అభియోగాలు అసత్యమైనవని జయేంద్ర సరస్వతి మార్చి 28న న్యాయమూర్తికి చెప్పారు.
2004 సెప్టెంబర్లో జరిగిన కాంచీపురం వరదరాజ ఆలయ మేనేజర్ శంకరరామన్ హత్యకేసులోనూ నిందితులుగా ఉన్న జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి తరువాత ఆ కేసునుంచి నిర్దోషులుగా బయటపడ్డారు. 2013లో వీరిద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పుదుచ్చేరి కోర్టు తీర్పు ఇచ్చింది. మఠంలోని జరిగిన అక్రమాలను బయటపెట్టినందున శంకరరామన్ను హతమార్చడానికి జయేంద్ర సరస్వతి కుట్ర పన్నారనేది ప్రాసిక్యూషన్ వారి అభియోగం. జయేంద్ర సరస్వతి, ఇతరులపై మోపిన అభియోగాలను పుదుచ్చేరి కోర్టు తోసిపుచ్చింది.