ఎకరా రూ. 29 కోట్లు!
Published Friday, 20 May 2016హైదరాబాద్, మే 19:హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ మరోసారి బహిర్గతమైంది. టిఎస్ఐఐసి ద్వారా నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో నగరంలోని పలుచోట్ల పారిశ్రామిక, గృహ అవసరాల కోసం అమ్మిన భూమి గరిష్ట ధర పలికింది. ఖానామెట్లో ఎకరానికి 29 కోట్ల రూపాయల ధర పలికింది. కున్ మోటారెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 29 కోట్ల రూపాయల ధరతో రెండెకరాల స్థలం కొనుగోలు చేసింది. ఖానాపేట్లోనే మరోచోట ఎకరాకు 18.20 కోట్ల ధర వచ్చింది. గృహ అవసరాల కోసం షేక్పేటలోని అల్ హమ్రా కాలనీలో 920 గజాల భూమి ఏడు కోట్ల ధర పలికింది. గజానికి 76,200 రూపాయలకు అమ్ముడు పోయింది. టిఎస్ఐఐసి ద్వారా ప్రభుత్వం భూములు వేలం వేయడం ఈ ఏడాదిలో ఇది రెండవ సారి. గతంలో నిర్వహించిన వేలంలో కూడా ఎకరానికి గరిష్టంగా 29.2 కోట్ల ధర వచ్చింది. దశలవారిగా మరికొన్ని బిట్లను అమ్మడానికి టిఎస్ఐఐసి ప్రణాళిక సిద్ధం చేసింది.