ఆంధ్రాలో పెరగనున్న 31 మంది ఐఎఎస్లు
Published Friday, 20 May 2016హైదరాబాద్, మే 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 31 ఐఎఎస్ పోస్టులను కేంద్రం కేటాయించనుంది. ఈ నెలాఖరులోగా ఈ విషయమై కేంద్ర పర్సనల్ ట్రైనింగ్ విభాగం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే కేంద్రం తెలంగాణకు 41 మంది ఐఎఎస్ అధికారులను కేటాయిస్తూ డిఓపిటి ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. రెండు రాష్ట్రాలు రాష్టవ్రిభజన జరిగినప్పటి నుంచి తమకు పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఐఎఎస్ అధికారుల సంఖ్యను పెంచాలని కోరాయి. కాని తెలంగాణ తొలుత ప్రతిపాదనలు పంపినందు వల్ల ఆ రాష్ట్రానికి ఐఎఎస్ అధికారుల సంఖ్యను పెంచుతూ డిఒపిటి నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 మంది ఐఎఎస్ అధికారులను కేటాయించారు. కాని 165 మంది ఐఎఎస్ అధికారులు మాత్రమే ఉన్నారు. 31 ఐఎఎస్ ఖాళీలు ఉండడంతో పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం కేంద్రానికి గత నెలలో ప్రతిపాదనలు పంపింది. సాధారణంగా ప్రతి ఏడాది సివిల్ సర్వీసు పరీక్షల్లో ఎంపికైన వారిలో ఐదుగురిని ప్రతి రాష్ట్రానికి కేటాయిస్తుంటారు. దీనికి తోడు సాధారణంగా ప్రతి ఏడాది పదవీ విరమణలు ఉంటాయి. ఈ ఏడాది ఐదుగురు ఐఎఎస్ ట్రైనీలను ఏపికి కేటాయించారు. ఒక వేళ కేంద్రం ఐఎఎస్ ట్రైనీలను కేటాయించలేని పక్షంలో గ్రూప్-1 ద్వారా ఎంపికై అనుభవం ఉన్న వారికి ఐఎఎస్గా పదోన్నతి కల్పించి 31 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా కేంద్రానికి పంపారు. ప్రతి ఏడాది రాష్ట్రంలో దాదాపు 10 మంది ఐఎఎస్ అధికారులు పదవీవిరమణ చేస్తుంటారు. 2010లో పది ఖాళీలు ఏర్పడితే, ఈ సంఖ్య ఇప్పటికి 46కు చేరింది. ఇందులో 30 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కేంద్రం భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి హోదాకు పదోన్నతులు ఇచ్చేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. విభజన తర్వాత ఆంధ్రాకు 211 ఐఎఎస్, 144 ఐపిఎస్, 82 ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయించారు. కాని అధికారుల కొరతతో 165 మంది ఐఎఎస్, 119 మంది ఐపిఎస్, 71 మంది ఐఎఫ్ఎస్ అధికారులు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 376 మంది ఐఎఎస్లు, 258 మంది ఐపిఎస్లు, 149 మంది ఐఎఫ్ఎస్ అధికారులు ఉండేవారు.