ఐఒసి పైపులైనుకు కన్నం
Published Sunday, 3 July 2016గంగవరం, జూలై 2: డీజిల్ సరఫరాకోసం చైన్నై- బెంగళూరు మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైపు లైన్ వేసింది. ఈ పైపు లైన్ చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నాల్గవ నెంబరు జాతీయ రహదారి పక్కగా వెళ్తుంది. అయితే మార్గమధ్యలో గల పొన్నమాకులపల్లి సమీపంలో ఐఓసి పైపులైనుకు కన్నం వేసి నెల రోజులుగా పెట్రోలు, డీజల్, గ్యాస్ను తస్కరించి డాబా హోటల్కు సరఫరా చేసుకొని యథేచ్చగా విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో ఐఓసి అధికారులు పైపులైను ఎక్కడో లీకేజీ ఉందని గుర్తించారు. వెంటనే చిత్తూరు నుండి కోలార్ వరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో శుక్రవారం రాత్రి పొన్నమాకులపల్లి వద్ద పైపులైనుకు కన్నం వేసి డీజల్, పెట్రోల్, గ్యాస్ను మరో పైపులైను ఏర్పాటు చేసుకొని సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీంతో ఐఓసి అధికారులు గుర్తించి హోటల్ యజమాని కృష్ణగౌడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే కన్నం వేసిన వ్యక్తులు పరారీ అయ్యారు. ఐఒసి అధికారులు, పోలీసులు పరిశీలన అనంతరం అక్కడే పోలీసులను కాపలా వేసారు. హోటల్ యజమాని కృష్ణపై కేసు నమోదు చేసినట్లు సిఐ రవికుమార్ తెలిపారు.
చిత్రం.. ఐఓసి పైపు లైనుకు కన్నం వేసి హోటల్కు కనెక్షన్ ఇచ్చుకున్న దృశ్యం