రైతుల సమస్యలపై నిలదీస్తా
Published Sunday, 3 July 2016శ్రీకాళహస్తి, జూలై 2: రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న భూ సేకరణపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని వైకాపా శాసనసభాపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. శనివారం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతూ శ్రీ శ్రీకాళహస్తిలో ఎపి సీడ్స్ కూడలిలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తొట్టంబేడు మండలంలోని చోడవరం, చీయవరం, కాసరం గ్రామాల రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిసి భూ సేకరణ గురించి ఫిర్యాదు చేశారు.
ఫ్యాక్టరీల కోసం వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. దీని వల్ల రైతులు కూలీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, భూసేకరణను వెంటనే ఆపాలని ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ రైతుల తరపున అసెంబ్లీలో పోరాడేందుకు హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు హరి, బాలకృష్ణయ్య, హేమభూషణ్ రెడ్డి, వాసుదేవ నాయుడు, నాగభూషణం, జయశ్యాం తదితరులు స్వాగతం పలికారు.
దబ్బల కుటుంబానికి పరామర్శ
సూళ్లూరుపేట: ఇదిలావుండగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందిన వైకాపా కేంద్ర కమిటీ సభ్యులు దబ్బల రాజారెడ్డి అంత్యక్రియలు సూళ్లూరుపేటలో శనివారం జరిగాయి. ఆయన మృతిని తెలుసుకొన్న వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూళ్లూరుపేటకు విచ్చేసి ఆయన భౌతికాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చిత్రం.. శ్రీకాళహస్తిలో ప్రజలనుంచి వినతిపత్రాన్ని స్వీకరిస్తున్న జగన్