S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నారాయణ పెత్తనంపై మంత్రుల నారాజ్!

హైదరాబాద్, జూలై 2: మంత్రివర్గంలో సీనియర్లను పక్కనపెట్టి, మంత్రి నారాయణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని నగర నిర్మాణం, తాత్కాలిక సచివాలయంపై నారాయణకు పెత్తనం ఇవ్వడాన్ని మంత్రులు సహించలేకపోతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగులను తరలించకుండా, అనవసర ప్రతిష్ఠకు పోయిన వ్యవహారం, ఉద్యోగులంతా ఒక్కరోజులోనే తిరిగి వెళ్లడంతో అప్రతిష్ఠపాలవాల్సి వచ్చిందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగులను పిలిపించి ఉండాల్సి ఉండగా, మంత్రి నారాయణ అత్యుత్సాహం వల్ల, ఏర్పాట్లు అసంపూర్తిగా ఉండటంతో ఉద్యోగులు ఒక్కరోజు మాత్రమే పనిచేసి, తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందని, దీనికి తమ బాధ్యత లేదని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. అసలు వెలగపూడిలోనే కాదు, అమరావతిలో కూడా ఏం జరుగుతోందో తమకు తెలియడం లేదంటున్నారు. వెలగపూడిలో పనిచేద్దామని ఐదు బస్సుల్లో వచ్చిన ఉద్యోగులకు అక్కడ సరైన సౌకర్యాలు కల్పించలేదని, అన్నీ వేళ్లాడుతూ కనిపిస్తున్నాయని, రోడ్డంతా బురదమయం అయిందని ఉద్యోగులు తమకు ఫిర్యాదు చేస్తే, తాము వారికి ఎలాంటి సమాధానం చెప్పలేకపోయామని మంత్రులు అంటున్నారు.
చివరకు 27న ప్రారంభం కావలసిన తాత్కాలిక సచివాలయ భవనం రెండురోజులు ఆలస్యంగా ప్రారంభమయిందని, ఆ విషయం కూడా తమకు జిఏడి అధికారులు చెబితేనే తెలిసిందని మంత్రులు వాపోతున్నారు. ఆ కార్యక్రమానికి మంత్రులంతా రావలసి ఉన్నప్పటికీ, కేవలం అయ్యన్నపాత్రుడు, మృణాళిని మాత్రమే వచ్చారు. మిగిలిన వారు డుమ్మా కొట్టారు. ద్వితీయ విఘ్నం ఉండకూడదన్న సెంటిమెంట్‌తో మృణాళిని రెండోరోజు పనిచేయగా, అయ్యన్నపాత్రుడు రెండోరోజు హాజరుకాకుండానే వెళ్లిపోయారు. అయితే పాత్రుడి అసంతృప్తికి వేరే కారణాలున్నాయంటున్నారు. తన చాంబరుకంటే, తన కార్యదర్శుల చాంబర్లే విశాలంగా ఉండటంతో, పాత్రుడు మనస్తాపానికి గురయ్యారంటున్నారు. ఏ చాంబర్లు ఎవరికి కేటాయించాలని కూడా నారాయణ నిర్ణయించారని, కనీసం ముందుగా తమతో ఒక్కమాట కూడా చెప్పలేదంటున్నారు.
నారాయణ అత్యుత్సాహం వల్ల, ఉద్యోగులంతా వెనక్కి వెళ్లిపోవలసి వచ్చిందని మంత్రులు తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. తాత్కాలిక సచివాలయానికి తరలింపు అంశంపై నారాయణ అనవసర ప్రతిష్ఠకు వెళ్లడం వల్లనే ఇంత రాద్ధాంతం జరిగిందని, అదే కొద్దిరోజులు ఆలస్యమైనప్పటికీ, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తరలించి, హైదరాబాద్‌లోని సచివాలయ సిబ్బందిని రిలీవ్ చేసి పంపి ఉంటే ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగేదంటున్నారు.
తాత్కాలిక సచివాలయం, అమరావతి వ్యవహారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తమతో సంప్రదించడం లేదని, దానితో మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు తాము సమాధానం చెప్పుకోవలసిన సంకటం వచ్చిందని మంత్రులు వాపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో అన్ని విషయాలు సంప్రదించిన బాబు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కేవలం నారాయణతోనే అభిప్రాయాలు పంచుకుంటున్నారన్న వ్యాఖ్యలు మంత్రుల నుంచి వినిపిస్తున్నాయి. నారాయణకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, తనకు సంబంధించిన రెవిన్యూ వ్యవహారాలను కూడా ఆయనకే అప్పగించడంతో రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి కూడా చాలాకాలం నుంచి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.