రహదారి నిర్మాణాలపై బోర్డులు ఏర్పాటు చేయాలి
Published Sunday, 3 July 2016వరంగల్, జూలై 2: పంచాయతీరాజ్ శాఖ తరపున గ్రామాల్లో నిర్మించనున్న రహదారులపై ముందుగా గ్రామసభ పెట్టి సభలో వచ్చే సలహాలు, సూచనల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో ఆయా శాఖలో పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారుల నిర్మాణాలపై ముందుగా బోర్డులు ఏర్పాటుచేయాలని, వాటిపై రహదారి వివరాలతో పాటుగా సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారి ఫోన్లు నెంబర్లు ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో 12రహదారుల నిర్మాణంపై సామాజిక తనిఖీ జరిగిందని, వాటిలో అక్రమాలు జరిగినట్లు ఏమి వెల్లడికాకపోయినప్పటికీ దీని వల్ల జవాబుదారితనం వస్తుందన్నారు. ప్రభుత్వం తరపున జరిగే ప్రతి పని వివరాలను సంబంధిత గ్రామాల ప్రజలకు తెలిసేలా చేయగలిగితే పారదర్శకత పెరగడమే కాక ప్రజల్లో ఆసక్తి అవగాహన పెరుగుతుందన్నారు. సామాజిక తనిఖీ పని పూరె్తైన తర్వాత జరిగే కన్నా మొదలైన క్రమంలో, ప్రగతిలో ఉన్నప్పుడు చేస్తే సరిదిద్దే అవకాశాలు ఉంటాయన్నారు. సామాజిక తనిఖీ సాంకేతిక పనులు, నాణ్యత, పనికాలంపై ఎక్కువగా జరగాలని, పని పూరె్తైన తర్వాత జరిగితే వాటిలో వచ్చిన లోపాలను సవరించేందుకు అవకాశం ఉండదని అన్నారు.