ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మూసివేస్తే ప్రభుత్వ పతనం తప్పదు: ఎఐఎస్ఎఫ్ హెచ్చరిక
Published Sunday, 3 July 2016తిరుపతి, జూలై 2: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ వసతి గృహాలను ప్రభుత్వం మూసివేయాలని చూస్తే పతనం తప్పదని ఎఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పురుషోత్తం, బండి చలపతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలను మూసివేయడాన్ని నిరసిస్తూ శనివారం చెన్నారెడ్డి కాలనీలోని ఎ ఎస్ డబ్ల్యూ ఓ కార్యాలయాన్ని విద్యార్థులతో కలిసి ఎఐఎస్ఎఫ్ నేతలు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనేర్చుకోవాలని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న నాయకులు వారి సంక్షేమ వసతి గృహాలను మూసివేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే 25నుంచి 30 వసతి గృహాలను మూసివేయడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు. ఇక సంపూర్ణ అక్షరాస్యత ఎక్కడ సాధ్యమని ప్రశ్నించారు. హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫాం, కాస్మొటిక్స్ ఛార్జీలు ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పేద విద్యార్థుల సంక్షేమానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమస్యపై ఈనెల 5న చిత్తూరులో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఓబులేశు, విష్ణు, వెంకటేష్, జయమ్మ, విజయ తదితరులు పాల్గొన్నారు.