కూల్చిన ఆలయాలు పునర్నిర్మిస్తాం
Published Sunday, 3 July 2016విజయవాడ:కృష్ణా పుష్కరాలకోసం చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న ఆతృతలో అధికారులు చేసిన పొరపాటు ఫలితంగా కొన్ని ఆలయాల కూల్చివేత జరిగిందని, ప్రభుత్వం ఆలయాల కూల్చివేత చేపట్టాలని నిర్ణయించలేదని మంత్రుల బృందం స్పష్టం చేసింది. పట్టణంలో శనీశ్వర, దక్షిణముఖ ఆంజనేయ, విజయేశ్వర ఆలయాల కూల్చివేతతో బిజెపి సహా స్థానిక నేతలు, ప్రజలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించింది. మంత్రులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావుల, మాణిక్యాలరావుతో కూడిన బృందం ఆయా ఆలయాల ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం వారు పరిస్థితిని సమీక్షించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, పుష్కరాల పనులకోసం ఇక ముందు తీసుకోబోయే చర్యలపై స్థానిక నాయకత్వంతో చర్చిస్తామని వారు తెలిపారు. కూల్చివేతకు గురైన ఆలయాలను అద్భుతంగా పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గోశాలపై నిర్వాహకులతో చర్చిస్తామని చెప్పారు. కాగా ఆలయాల కూల్చివేత వ్యవహారంపై అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని, మురికివాడగా ఉన్న నగరానికి కొత్తశోభ వచ్చేలా చర్యలు చేపడితే స్వార్థంకోసం కొందరు వివాదంగా మార్చారని ఎంపి కేశినేని నాని ఆరోపించారు. పరోక్షంగా ఆయన బిజెపి నేతలపై విమర్శలు చేశారు.