లోగిస సమీకృత వసతి గృహంతో మూడు హాస్టళ్ల విలీనం
Published Monday, 4 July 2016గజపతినగరం, జూలై 4: మండలంలోని లోగిస గ్రామంలో నిర్మించిన సమీకృత వసతి గృహంతో మెంటాడ, గజపతినగరం మండలాలోని వసతి గృహాలు పూర్తిగా మూతపడడమే కాకుండా ఇ క్కడ పనిచేసిన వసతి గృహం సంక్షేమ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులను అక్కడికి తరలివెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరోపక్క వసతి గృహం మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరం ఉండడం, రవాణా సౌకర్యాలు అంత గా లేకపోవడంతోపాటు బస్సులు లేక ఎప్పుడో తిరిగే ఆటోలు మాత్రమే ఉండడంతో ఉద్యోగులు, విద్యార్థులు వసతి గృహానికి వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తున్నారు. మెంటాడ మండలంలోని ఎస్సీ, బిసి వసతిగృహం, చల్లపేటలోని బిసి వసతిగృహం, గజపతినగరంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మూసివేసి లోగిసలోని సమీకృత వసతి గృహంలోకి విద్యార్థులకు ప్రవేశాలు జరిపేలా ప్రభు త్వం నిర్ణయం తీసకున్నారు.
ఈ వసతి గృహంలో 300 మంది విద్యార్థులకు సరిపడేలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 3.50 కోట్లతో అన్ని సౌకర్యాలతో వసతి గృహం నిర్మాణం చేపట్టారు. నాలుగు వసతి గృహాల్లో గత ఏడాది 400 మంది వరకు విద్యార్థులు ఉండగా ప్రస్తుతం సమీకృత వసతి గృహంలో ఇంతవరకు వందమంది విద్యార్థులు మాత్రమే చేరారు. అక్కడ చదివే ప్రతి విద్యార్థిని ఈ వసతి గృహంలో చేర్చాల ని సంక్షేమ అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. మండల కేంద్రానికి దూరంగా ఉండటమే ప్రధాన కారణం. సమీకృత వసతి గృహంలో పనిచేయడానికి ఇద్దరు కుక్లు, ఇద్దరు వాచ్మెన్లు, ఒక సంక్షేమ అధికారి, ఇద్దరు కమాటీ లు సరిపోగా, నాలుగు వసతి గృహాల్లో పనిచేస్తున్న 16మంది ఉద్యోగులు అక్కడికి తరలి వచ్చారు. మూసివేసిన వసతి గృహాల్లో పనిచేసిన సిబ్బందికి ఇక్కడ సరిపడా ఉంచి మిగిలిన వారిని ఎక్కడికి బదిలీ చేస్తారో అన్న భయం ఉద్యోగులల్లో నెలకొంది.