జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తాం
Published Tuesday, 5 July 2016విజయనగరం(టౌన్), జూలై 4: జిల్లాను ప్రగతిబాటలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పల్లె రఘునాధరెడ్డి స్పష్టంచేసారు. సోమవారం సాయంత్రం జడ్పీ అతిధి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చంద్రన్న బాట పథకం ద్వారా గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా విత్తనాలు,ఎరువులు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించామని అన్నారు. ఈ ఏడాది 1200 కోట్ల రూపాయల ఆదాయం సాధించాలని వ్యవసాయశాఖకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు.వ్యాధులు ప్రబలకుండా అధికారులను అప్రమత్తం చేసామని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించినట్లు తెలిపారు. చంద్రన్న భీమా పథకం అసంఘటిత రంగ కార్మికులు, పేదలు సద్వినియోగంచేసుకోవాలని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇన్సూరెన్సు, హెల్త్స్కీమ్ ప్రవేశపెట్టామని తెలిపారు. ఈసమావేశంలో జడ్పీ చైర్పర్సన్, స్వాతిరాణి, ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యేలు మీసాల గీత, నారాయణస్వామినాయుడు పాల్గొన్నారు.