భార్యను చంపి.. ముక్కలు చేసి.. మూట గట్టి
Published Tuesday, 5 July 2016శంషాబాద్, జూన్ 4: తనతో గొడవ పెట్టుకున్నదని కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడో ఘనుడు. చనిపోయిన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి.. ఒక సూట్కేస్లో పెట్టుకుని, కన్నకూతుర్ని వెంటబెట్టుకుని శంషాబాద్ శివార్లలోకి తీసుకువచ్చి దహనం చేసేశాడా మొగుడు. నగరు శివారులోని శంషాబాద్ మండలం, మదన్పల్లి గ్రామం పక్కన ఉన్న గ్రీన్ సిటీ వెంచర్లో కన్నకూతురు సాక్షిగా తన భార్య శవాన్ని తగలబెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన సోమవారం రాత్రి రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని మదన్పల్లి వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రీన్ సిటీ వెంచర్వద్ద జరిగింది. రూపేష్ అనే వ్యక్తి తన భార్యతో ఆదివారం రాత్రి సికిందరాబాద్లోని తన నివాసంలో గొడవపడి ఆవేశంతో హతమార్చాడు. ఆ తరువాత ముక్కలు ముక్కలుగా నరికి సూట్కేసులో ఇక్కడికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి తన వెంట వచ్చిన కన్న కూతురు ముందే తగులబెట్టాడు. ఈ సందర్భంగా మంటలు పెద్ద ఎత్తున రావడంతో మదనపల్లి గ్రామస్థులు చూసి అతనిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ ఎసిపి అనురాధ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. రూపేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. శంషాబాద్ రూరల్ పోలీసుస్టేషన్ సిఐ ఉమామహేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.