ఎంపి అసద్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కమలనాధులు
Published Tuesday, 5 July 2016చార్మినార్, జూలై 4: భాగ్యనగరంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు న్యాయపరమైన సహాయాన్ని చేస్తామంటూ హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ చేసిన వ్యాఖ్యలపై నగర కమలనాధులు భగ్గుమంటున్నారు. దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్న మజ్లిస్ పార్టీపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని గ్రేటర్ హైదరాబాద్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. అంతేగాక, సిటీ బిజెవైఎం నేతలు బషీర్బాగ్ చౌరస్తాలో ఎంపి అసద్ చిత్రపటాన్ని దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా, ఉగ్రవాదుల మూలాలు నగరంలోనే కన్పించటం, నగరంలో భారీగా విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేసిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ పట్టుకున్న నేపథ్యంలో వారికి అనుకూలంగా ఓ బాధ్యతాయుతమైన ఎంపి హోదాలో అసదుద్దిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల ఉగ్రవాద చర్యల వెనక మజ్లిస్ పార్టీ ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మజ్లిస్ అసలు రూపాన్ని గుర్తించి, తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వెంకట్రెడ్డి త్వరలోనే భారతీయ జనతాపార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాధ్సింగ్ను కలిసి మజ్లిస్ పార్టీని నిషేధించాలని కోరనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, అసద్ వ్యాఖ్యలకు నిరసనగా బిజెవైఎం నేతలు సోమవారం మధ్యాహ్నం బషీర్బాగ్ చౌరస్తాలో అసద్ ఫొటోలను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా బిజెవైఎం సిటీ అధ్యక్షులు ఆలే జితేందర్, నేతల నితిన్ నంద్కర్ మాట్లాడుతూ ఒకవైపు ఐఎస్ఐఎస్ను తాను వ్యతిరేకిస్తున్నానని చెబుతూనే ఎంపి అసద్ మరోవైపు ఉగ్రవాదులకు న్యాయపరమైన సహాయం చేస్తామని చెప్పటంతో ఆయన రెండు మాటల ధోరణీ, ఉగ్రవాదులు పట్ల ఆయన సానుభూతి అర్థమవుతుందన్నారు. ఇలాంటి స్వార్థ రాజకీయ నేతలు తమ అవసరాల కోసం చేసే ఇలాంటి ప్రకటనలు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ఉన్నాయన్నారు. దీన్ని బిజెవైఎం తరపున తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.