సిస్టర్ సిటీ ఒప్పందం కుదుర్చుకుందాం
Published Tuesday, 5 July 2016హైదరాబాద్, జూలై 4: ఇరాన్లోని చారిత్రక నగరమైన ఎస్ఫాహన్ సిటీ ప్రతినిధుల బృందం సోమవారం మేయర్ బొంతు రామ్మోహన్ను అధికారికంగా ఆయన చాంబర్లో కలిసింది. హైదరాబాద్, ఎస్ఫాహన్ నగరాల మధ్య సిస్టర్ సిటీ ఒప్పందాన్ని కుదుర్చుకుందామని, ఇందుకు మేయర్ తగు సమయాన్ని కేటాయించాలని కోరింది. ఇరాన్ దేశ కౌన్సిల్ జనరల్ హసన్ నౌరీస్ నేతృత్వంలోని ఈ ప్రతినిధుల బృందం పౌరసేవల నిర్వహణ, అభివృద్ధిలో పరస్పర అనుభవాల్ని, నైపుణ్యతను పంచుకునేందుకు సముఖతను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇరాన్ కౌన్సిల్ జనరల్ హసన్ నౌరీస్ మాట్లాడుతూ ఇరాన్, హైదరామాద్ మధ్య దాదాపు నాలుగు దశాబ్దాల చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ బంధం ఉందని గుర్తుచేశారు. హైదరాబాద్ నగర నిర్మాణం, చార్మినార్ నిర్మాణానికి రూపకర్త అయిన ముమిన్ అస్తరాబాది ఇరాన్ దేశ పౌరుడేనని వారు గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలో ఆర్థిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో ఇరానియన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని హసన్ తెలిపారు. ఇరాన్లో ఘనమైన సంస్కృతిక వారసత్వం కల్గిన చారిత్రక నగరమైన ఎస్ఫాహన్ సిటీతో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడకు రావాలని మేయర్ను బృందం కోరింది. ఇందుకు గాను తగు తేదీలు, సమయాన్ని సూచించాల్సిందిగా మేయర్కు వారు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మేయర్ తమ ఉన్నతాధికారులతో సంప్రదించి సమయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. ఇరాన్ కౌన్సిల్ జనరల్తో పాటు సీనియర్ కౌన్సిల్ అలీ ఫరియాద్, సీనియర్ పిఆర్వో నీర్మాద్ పాల్గొన్నారు.