మహిళ దారుణ హత్య
Published Tuesday, 5 July 2016తనకల్లు, జూలై 4: మండల పరిధిలోని నడిమితాండాలో ఆదివారం రాత్రి ఈశ్వరమ్మ (29) దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. నడమితండాకు చెందిన ఈశ్వరమ్మకు వెంకటరమణనాయక్తో వివాహం జరిగింది. వీరికి అశోక్నాయక్(12) కుమారుడు వున్నాడు. మూడేళ్ల క్రితం ఆమె భర్త వెంకటరమణనాయక్ మృతి చెందాడు. ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న ఈశ్వరమ్మపై బండరాయితో మోది హత్య చేశారు. హత్యకు కారణాలు తెలియకపోవడంతో పోలీసు జాగిలాలను రప్పించి తనిఖీలు నిర్వహించారు. జాగిలం అదే గ్రామానికి చెందిన వెంకటరమణ, అతని భార్య రాధమ్మ, మరో మహిళ సాలేమ్మల ఇళ్ల వద్దకు వెళ్లి ఆగింది. అప్పటికి వారు గ్రామంలో లేకపోవడంతో వారే ఈశ్వరమ్మను హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కదిరి డిఎస్పీ వెంకటరామాంజినేయులు, సిఐ రవికుమార్, ఎస్సై శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి వుందని డిఎస్పీ తెలిపారు.