పరిశ్రమల స్థాపనతోనే అభివృద్ధి
Published Tuesday, 5 July 2016రొళ్ళ, జూలై 4:విరివిగా పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఆయా ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం జరుగుతుందని ఎమ్మె ల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మె ల్యే ఈరన్న పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని హనుమంతనపల్లిలో పరిశ్రమల స్థాపన కోసం భూములను పరిశీలించారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపన ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ఎంతోమంది కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళారని, పరిశ్రమల ఏర్పాటు వల్ల అలాంటి పరిస్థితులు ఉండవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల స్థాపన కోసం ఎంతో అంకితభావంతో చర్యలు తీ సుకుంటున్నామన్నారు. ఇందుకోసం మడకశిరలో 1500 ఎకరాలు, రొళ్ళ, అగళిల్లో 3 వేల ఎకరాల భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయడం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ కనబర్చుతున్నట్లు తెలిపారు. శిరా-అమరావతిల నడు మ జాతీయ రహదారి మంజూరు కావడంతో రొళ్ళ, అగళి మండలాల్లో పరిశ్రమల స్థాపననకు ఆస్కారం ఏర్పడిందన్నారు. రాష్ట్రం లో పరిశ్రమలు స్థాపించేందుకు అనేక మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. వారందరికీ ప్రభుత్వం భూములు కేటాయించి వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు భూములు, చెట్లకు పరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. జడ్పీటీసీ పాండురంగప్ప, ఎంపిపి కిష్టప్ప, తహశీల్దార్ లక్ష్మానాయక్, ఎంపిడిఓ సరస్వతి, నాయకులు రవిభూషణ్, గురుమూర్తి, మం జునాథ్, హనుమప్ప, నాగరాజు, సన్నమారేగౌడ్, పాండురంగప్ప, ముద్దరాజు, శశికుమార్ పాల్గొన్నారు.