ప్రజా సమస్యలు పరిష్కరించాలి
Published Tuesday, 5 July 2016కడప,(కల్చరల్)జూలై 4: మీకోసంలో ప్రజలు సమర్పించిన సమస్యలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్త కలెక్టరేట్లోని మీ కోసం భవనంలో జరిగిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి సమస్యల వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసంలో సమస్యల వినతులు ప్రజలు సమర్పించారని వాటిని పెండింగ్ లేకుండా జిల్లా అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి అష్టకష్టాలుపడి ప్రయాసతో వస్తారని వారిపట్ల మంచిగా మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. గతంలో సమర్పించిన సమస్యలను ఆయా శాఖలలో పెండింగ్ ఉంటే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి సమస్య పరిష్కారం కోసం ఆయాశాఖల జిల్లా అధికారులకు అర్జీలను బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, ఆర్డీవో సులోచన, జిఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు, డిడబ్ల్యుఎం ఏపిడి రమేష్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.