హిందువుల మనోభావాలతో ప్రభుత్వం చెలగాటం
Published Tuesday, 5 July 2016కడప,(కల్చరల్)జూలై 4: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం హిందూ దేవాలయాలను కూల్చివేసి అభివృద్ధి పనులు చేయాలనుకోవడం హిందువుల మనోభావాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటమేనని హిందు దేవస్థాన 108 ఆలయాల కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు జికె మునెయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాజధాని విజయవాడలో హిందువులు పూజించే పురాతన దేవాలయాలు కూల్చడం హిందు మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. హిందువుల సాంప్రదాయాలు, పురాణాలు, వేదాలు ఇవన్నీ తెలియని నేటి తరం సాంస్కృతికంగా హిందు సంప్రదాయాలను అర్థం చేసుకోకపోవడం వల్ల అతిచిన్న పాటి ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతా ల్లో చిన్న చిన్న ఆలయాలైన ఆ ప్రాంతాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించేవారని వారి మనోభావాలను దెబ్బతినకుండా అభివృద్ధికి ఆటంకం ఏర్పడినప్పుడు దేవాలయాలను యథాతదంగా ఉంచుతూ మార్పు చేయాలని సూచించారు. హిందువులను అవమానపరిచిన వారిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వపాలకులు హిందుమనోభావాలు దెబ్బతీయకుండా ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆ దేవాలయాలను వెంటనే పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఇకమీద హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా తగి న జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులు ప్రజల ఆమోదం మేరకు జరపాలన్నారు.