చిల్లర నాణేల పరకామణికి నూతన భవనం
Published Tuesday, 5 July 2016తిరుపతి, జూలై 4: చిల్లర నాణేలు, పాత నోట్ల పరకామణికి త్వరలో నూతన భవనం నిర్మిస్తున్నట్లు టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం పరకామణి సేవలో ఇఓ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇఓ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీలో భక్తులు సమర్పించే కానుకల్లో నోట్లను శ్రీవారి ఆలయంలోనే లెక్కిస్తుండగా, చిరిగిన నోట్లను, చిల్లర నాణేలను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించి లెక్కిస్తున్నట్లు తెలిపారు. టిటిడి సిబ్బంది, పరకామణి సేవకులతో చిల్లర నాణేలను, పాత నోట్లను లెక్కిస్తున్నట్లు వివరించారు. విదేశీనాణేలు, సత్తునాణేలు, పాత, చిరిగిన నోట్లకు సంబంధించి రిజర్వుబ్యాంకు, ఇతర బ్యాంకులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. పరకామణి భద్రతకు సంబంధించి ఇప్పటికే సిసి కెమెరాల నిఘా ఉందని, మరింత భద్రత పెంచి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. ముందుగా చిల్లర నాణేల పరకామణిలో విదేశీ నాణేలు, బంగారు, వెండి, రాగి నాణేలను, పాత నోట్ల పరకామణిలో చిరిగిన, మరకలు పడిన నోట్లను పరిశీలించారు. అక్కడి అధికారులతో చర్చించి పరకామణి హాలులో దుమ్ము, దూళి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఎప్ఏ, సిఎఓ బాలజి, ఇతర అధికారులు పాల్గొన్నారు.