చిరస్మరణీయుడు సీతారామరాజు
Published Tuesday, 5 July 2016అమలాపురం, జూలై 4: దేశ స్వాతంత్య్ర పోరాటంలో స్ఫూర్తిదాయకమైన పాత్ర నిర్వహించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అల్లూరి 120వ జయంతిని పురస్కరించుకుని సోమవారం అమలాపురం రూరల్ మండలం వనె్నచింతలపూడి గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు తన ప్రాణాలను పణంగా పెట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని, అటువంటి మహాయోధులను ఆదర్శంగా తీసుకుని యువత దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజుకు ఉభయ గోదావరి జిల్లాలతో ఎనలేని అనుబంధం ఉందన్నారు. స్వాతంత్య్ర సాధనలో బ్రిటిషువారితో విప్లవ పోరాటాలు చేసి ప్రాణాలర్పించిన మహయోధుడు సీతారామరాజు అన్నారు. కార్యక్రమంలో సమనస, వనె్నచింతలపూడి సర్పంచులు నడింపల్లి ఉదయబాబు, పరమట మోహన్కుమార్, నీటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ జంపన రామరాజు, ఎఎంసి డైరెక్టర్ బిహెచ్ త్రిమూర్తులు, నడింపల్లి సోమరాజు పాల్గొన్నారు.