ఎపి జెన్కో థర్మల్ కేంద్రంలో కార్మికుడు మృతి
Published Tuesday, 5 July 2016ముత్తుకూరు, జూలై 4: మండలంలోని నేలటూరు గ్రామ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఎపి థర్మల్ కేంద్రంలో సోమవారం జరిగిన ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే కార్మికుడు మృతి చెందాడు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరుకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు థర్మల్ కేంద్రంలోని ఐఎన్సి కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో రెండో యూనిట్ సెక్షన్ వద్ద సుమారు 20 మీటర్లు పైన కలిగిన లిఫ్టు నుంచి జారి పడటంతో కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీంతో సిపిఐ, సిపిఎంకు చెందిన నాయకులు ఎపి థర్మల్ కేంద్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై ప్రాజెక్టు వద్ద ఆందోళన చేశారు. థర్మల్ కేంద్రంలోని కార్మికుల ప్రాణాలకు రక్షణ కరవు అయిందంటూ వారు మండిపడ్డారు. మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాజెక్టు భద్రతా బలగాలతోపాటు కృష్ణపట్నం పోర్టు ఎస్ఐ విశ్వనాథ్రెడ్డి, ముత్తుకూరు ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి గట్టి బందోబస్తు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.