మతోన్మాదాన్ని అంగీకరించడమే జాతీయవాదమా?
Published Tuesday, 5 July 2016నెల్లూరు కలెక్టరేట్, జూలై 4: మతోన్మాదాన్ని అంగీకరించటమే జాతీయవాదమైతే అది ఫాసిస్ట్ చర్య అవుతుందని విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకులు జి కల్యాణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టౌన్హాలులో సోమవారం విరసం 46వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పురోగతి శ్రామికుల శ్రమతోనే ఇమిడి ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలన్నారు. సోషలిజం స్వప్నసీమ కానేకాదని ఆకలంత సహజమని అన్నమంత అవసరమన్నారు. విప్లవాలు, ఉద్యమాల పరమావధి మనిషికి మానవత్వాన్ని చేకూర్చడమేనన్నారు. హిందూ మతోన్మాద శక్తులను సంఘటితంగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత నేడు ఏర్పడిందన్నారు. అందుకోసం విరసం మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానాన్ని తన సైద్ధాంతిక భూమికగా ఎంచుకుని తమ కలాన్ని, గళాన్ని ప్రజలకు అంకితం చేసి పాటలు, కవితలు, నాటిక-నాటకాల ద్వారా జాగృత పరుస్తుందన్నారు. సభలు, సమావేశాలు, చర్చాగోష్టులుతో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలను చైతన్యపరచాల్సిన ఆవశ్యకత నేటి యువతరం మీద ఉందన్నారు. సిఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ తత్వవేత్తలు ప్రపంచాన్ని వివిధ రకాలుగా వాఖ్యానిస్తే మార్క్స్ అసలు విషయాన్ని మార్చాడన్నారు. ప్రజలను జాగృతపరచేవారందరూ కవులు, ఉద్యమకారులేనన్నారు. పి కోటయ్య అద్యక్షత వహించిన ఈ సభలో విరసం నాయకులు వి చంచయ్య, అబ్బాయి రెడ్డి, బ్రహ్మం పాల్గొన్నారు.