మరింత మెరుగ్గా పారిశుద్ధ్యం
Published Tuesday, 5 July 2016జగదాంబ, జూలై 4 : నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం కాలినడకన సత్యం జంక్షన్, గాంధీనగర్, మద్దిలపాలెం కూడలిలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో చెత్త వుండటం, డ్రైయిన్లలో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోవడం పట్ల కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శానిటరి ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, పారిశుద్ధ్య కార్మికులు వారికి కేటాయించిన ప్రదేశంలో విధులు నిర్వర్తించడం ద్వారా ఆ ప్రాంతాలలో పరిశుభ్రత ప్రతిబింబించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. త్వరతిగతిన డ్రైయిన్ల క్లియరన్స్ను పూర్తి చేయాలని కార్య నిర్వాహక ఇంజనీర్ వెంకటిని ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకంపై నిషేదాన్ని గమనించాలని, సులభ్ కాంప్లెక్స్ల పనీతీరు గురించి పర్యవేక్షించాలని పేర్కొన్నారు. నగరాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో అధికారులు, ప్రజారోగ్య సిబ్బంది మెరుగైన రీతిలో విధులు నిర్వర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఎడిహెచ్ దామోదర్, రెండవ జోనల్ కమిషనర్ నల్లనయ్య, ఎసిపి సంజివి, జోనల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సర్వీస్ రోడ్డు మీడియన్స్లో మొక్కలు నాటండి
నగరంలో ప్రధాన సర్విస్రోడ్డు మిడియన్స్లలో మొక్కలు నాటాలని జివి ఎంసి కమిషనర్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. షీలానగర్ నుండి గాజువాక మెయిన్ రోడ్డు, ఎయిర్పోర్సు నుంచి మద్దిలపాలెం కూడలి వరకూ నాటిన మొక్కలను నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాలన్నారు. నగరం అందానికి, పచ్చదనానికి పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, బాగా మొక్కలు పెరిగిన చోట ట్రీ గార్డులను తొలగించాలని ఆదేశించారు.