శ్రీ అనంత ఆదిశేష భగవానుడికి అభిషేకాలు
Published Tuesday, 5 July 2016కూచిపూడి, జూలై 4: నిరంతరం హరినామ సంకీర్తనతో ఓలలాడుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో సోమవారం శ్రీ అనంత ఆదిశేష భగవానుడి అభిషేకానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జేష్టబహుళ అమావాస్య సందర్భంగా శ్రీ ఆదిశేష భగవానుడి అభిషేకాన్ని ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు, కమల దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పండితుల వేదమంత్రాలు, భక్తుల వాసుదేవ నామస్మరణలు, శ్రీసూక్తం, పురుష సూక్తం, రుద్రసూక్తం వంటి పంచ సూక్తాల నేపథ్యంలో శ్రీ సీతారాం గురుదేవులు శ్రీ అనంత ఆదిశేష భగవానుణ్ణి అభిషేకించారు. అంతకుముందుగా శ్రీ సీతారాం గురుదేవ దంపతులు గోపూజ నిర్వహించారు. ఆశ్రమంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి అనుగ్రహభాషణ చేశారు. ఆశ్రమ సన్నిధి కార్యదర్శి తుర్లపాటి రాధాకృష్ణ, ముత్తీవి గౌరాకృష్ణ పర్యవేక్షణలో తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, ఆత్మకూరి లక్ష్మణదాసు, యతీంద్ర సేవ సమితి సభ్యులు భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.