సాగునీరు విడుదల సఫలీకృతమయ్యేనా..?
Published Tuesday, 5 July 2016అవనిగడ్డ, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఖరీఫ్ సాగుకు ఈనెల 10లోపు సాగు నీరు విడుదల చేస్తామని చేసిన ప్రకటన ఏ మేరకు సఫలీకృతం అవుతుందనేని రైతాంగానికి ప్రశ్నార్ధకంగా మారింది. డెల్టా ఆధునీకరణ భాగంగా దివిసీమలో భారీగా పనులు జరుగుతున్నాయి. కాలువలు తవ్వి ఎక్కడ మట్టి అక్కడే పెద్ద ఎత్తున గుట్టలుగా పోసి ఉన్నాయి. ముఖ్యంగా దివి మెయిన్ కెనాల్కు రివిట్మెంట్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రోడ్డుకు, రివిట్మెంట్కు మధ్యలో పూడికకు గాను కాలువలో మట్టిని పెద్ద పెద్ద గుట్టలుగా సిద్ధం చేశారు. కనీసం 10లోపు దివి మెయిన్ కెనాల్కు నీరు రాగలవనే ఆశతో రైతాంగం ఉన్న సందర్భంలో ఈ గుట్టలు అడ్డంకిగా ఉండి ఏ మేరకు సాగునీరు వస్తుందనేని చర్చనీయాంశమైంది. కేవలం నాలుగు రోజుల్లో కెనాల్లోని మట్టి గుట్టలను తొలగించటం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో సాగునీరు సకాలంలో రావడం ఎంత వరకు సాధ్యపడుతుందోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు.