నగరంలో రంగాకు ఘననివాళి
Published Tuesday, 5 July 2016విజయవాడ, జూలై 4: మాజీ శాసనసభ్యుడు, వైకాపా నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో అనేక ప్రాంతాల్లో దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా 69వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ముందుగా రాఘవయ్య పార్క్ సమీపంలోని రంగా విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రంగా అభిమానులు అనుచరులతో భారీ ర్యాలీగా నగరమంతటా తిరిగి పలు శిబిరాల్లో ఏర్పాటు చేయబడిన రంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ర్యాలీలో జోహార్ రంగా అనే నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా జరిగిన పలు సభల్లో రాధాకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి ఆశయాల సాధన కోసం నిర్విరామంగా పాటుబడుతున్నానని అన్నారు. రంగా తుదిశ్వాస విడిచే వరకు పేదల పక్షాన పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, రాధా-రంగా మిత్రమండలి నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.