ఈ ఏడాది చివరికల్లా విచారణ పూర్తిచేయండి
Published Tuesday, 5 July 2016న్యూఢిల్లీ, జూలై 4: ఎమ్మెల్యే రోజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో రెండు వారాల్లో ఆమె లిఖిత పూర్వక వివరణ ఇచ్చే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్పై ఈ ఏడాది చివరి కల్లా విచారణను పూర్తి చేయాలని ఉమ్మడి హైకోర్టుకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలో విధానపరమైన లోపాలున్నాయని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. తన ఎన్నికపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై, ఆ పిటిషన్పై తాను దాఖలు చేసిన అభ్యర్థనపై విడివిడిగా విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో రోజా దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం ధర్మాసనం విచారించింది. నిబంధనల ప్రకారం మొదట రోజా అభ్యర్థనపై విచారించాలని అందుకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని, ఆమెకు లిఖితపూర్వక వివరణ ఇచ్చేందుకు అవకాశం సైతం కల్పించలేదని రోజా తరపున వీవీ గిరి ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషన్కు ఎమ్మెల్యే రోజా తప్పుడు సమాచారం ఇచ్చారని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలటూ 2014 జూన్ 30న వై.వి.రాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గతంలో రోజాకు నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు స్పందించిన రోజా తనపై దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే రాయుడు దాఖలు చేసిన పిటిషన్ను, రోజా అభ్యర్థనను కలిపి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే రెండు పిటిషన్లను కలిపి విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.