చిరుప్రాయంలోనే సేవా తత్పరత
Published Friday, 22 July 2016‘‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము’’ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను ఆచరణలో చూపిస్తున్న చిన్నారి మీరా వశిష్ఠ్. తన తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడినప్పటికీ, ఆమెకు మాతృదేశంపై వున్న మమకారం తగ్గలేదు. దేశంలో
విద్యుత్ పొదుపు చేయడం కోసం ఎల్.ఇ.డి (లైట్ ఎమిటింగ్ డయోడ్) బల్బులను ఏర్పాటుచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఆమెకు స్ఫూర్తిని కలిగించింది. ఎల్.ఇ.డి. బల్బుల ధరలు ఎక్కువగా ఉండటంతో అవి పేద అవి పేద ప్రజలకు అందుబాటులో ఉండటంలేదు. ఎల్ఇడి బల్బులను వినియోగించడం వలన గ్రీన్హౌస్ గ్యాసెస్ను కూడా తగ్గించవచ్చు. ప్రభుత్వ అంచనాల ప్రకారం, మన దేశానికి మొత్తం 77 కోట్ల ఎల్ఇడి బల్బులు అవసరం. కాగా,
ఇప్పటివరకు కేవలం 11.7 లక్షల ఎల్.ఇ.డి బల్బులు మాత్రమే ఏర్పాటుచేశారు.అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల సగుర్లాండ్లోని సర్పార్టియా మిడిల్ స్కూల్లో మీరా ఏడవ తరగతి చదువుతున్నారు. ఆమె చదువుకే పరిమితం కాకుండా హిందూస్థానీ శాస్ర్తియ సంగీతం, భరతనాట్యం, ఫ్లూట్లలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. భారతదేశంలోని పేదలకు ఎల్.ఇ.డి బల్బులు ఉచితంగా అందచేయడానికి ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతూ ఆమె తమ బంధువులు, స్నేహితులకు సుమారు ఐదు వందలకుపైగా ఉత్తరాలు రాశారు. పలువురు ఆమె విజ్ఞప్తిని మన్నించి విరాళాలను అందజేశారు. పదమూడు సంవత్సరాల
మీరా మొత్తం 2,079 డాలర్లు అంటే 1.40 లక్షల రూపాయలు విరాళాలు పోగుచేశారు. ఈ మొత్తంతో పదహారు వందల ఎల్.ఇ.డి బల్బులను కొనుగోలు చేసి త్వరలో ఢిల్లీ పేదలకు ఈ నెలలో పంపిణీ చేశారు. విద్యుత్ అందరికీ అందుబాటులోకి రావడంవలన వ్యవసాయ రంగానికి తగినంత విద్యుత్ను సరఫరా చేయవచ్చు. దీనివలన వ్యవసాయ దిగుబడులు కూడా పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు.