విమాన స్పేర్పార్ట్స్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల పరిశీలన
Published Saturday, 23 July 2016దొనకొండ, జూలై 21: దొనకొండ మండలం చందవరంలో 120కోట్ల రూపాయలతో స్పేర్పార్ట్స్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ ఎపిజె అబ్దుల్కలాం స్వశక్తి కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని చందవరం పంచాయతీలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని వారు పరిశీలించారు. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, విమానాలు, హెలికాఫ్టర్లకు సంబంధించిన విడి భాగాలను ఈ పరిశ్రమలో తయారుచేస్తారని, ముందుగా 2500మందికి ఈ సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బందితో ఈప్రాంతంలో మరికొందరికి శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. చందవరంలో చూపించిన భూమికి రహదారి సౌకర్యం సక్రమంగా లేదని, రహదారి సౌకర్యం కల్పిస్తే పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆయనతోపాటు కంపెనీ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, బెనర్జీ, నాగేశ్వరరావులతోపాటు తహశీల్దార్ కె వెంకటేశ్వర్లు, సర్వేయర్ వెంకటరావు, విఆర్ఓ చంద్రశేఖరశాస్ర్తీ, చందవరం టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.