10 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
Published Saturday, 20 June 2015విజయవాడ, జూన్ 19: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి సంబంధించి 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 10 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో స్థానానికి తెలుగుదేశం, వైకాపాల మధ్య హోరాహోరీ సాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం శుక్రవారం నాటితో ముగిసింది. కొందరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడటం, ఆఖరి నిముషంలో కొందరు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవటంతో 10 స్థానాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. విజయావకాశాలకు సరిపడా బలం లేని జిల్లాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్ ససేమిరా ఇష్టపడలేదు. బలం లేనిచోట అభ్యర్థులను బరిలోకి దించి అనవసరమైన విమర్శలకు గురికావాల్సి వస్తుందనే నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుమాత్రం తెలంగాణ శాసనమండలి ఎన్నికల వ్యవహారంపై పెద్ద రభస జరుగుతున్నప్పటికీ పార్టీకి బలం లేనప్పటికీ ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించడంతో ఈ రెండు జిల్లాల్లో ఎన్నిక అనివార్యంగా మారింది. కృష్ణాజిల్లాలో రెండు స్థానాలకు గాను వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండటంతో కొద్దిపాటి బలం ఉన్నప్పటికీ వైకాపా తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. టిడిపి తరపున మాజీ శాసనమండలి సభ్యుడు వైవిబి రాజేంద్రప్రసాద్, తెలుగుదేశం అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.