ఏపీలో భారీ వర్షాలు : ప్రయాణికుల ఇబ్బందులు
Published Thursday, 22 September 2016విజయవాడ : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో బుధవారం అర్ధరాత్రి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వరదనీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. పిడుగురాళ్ల వద్ద రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలుమ రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పిడుగు రాళ్ల మండలం అనుపాలెం సమీపంలో మాచర్ల-భీమవరం ప్యాసింజర్ రైలును, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల-రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్పై వర్షపునీరు చేరడంతో రెడ్డిగూడెం వద్ద పల్నాడు ఎక్స్ప్రెస్ను, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కృష్ణా ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాగులు పొంగి పట్టాలపైకి నీరుచేరడంతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ-పిడుగు రాళ్ల మధ్య ఫలక్నుమా ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే అమరావతి ఎక్స్ప్రెస్ నడికుడిలో నిలిపివేశారు. సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు పట్టణంలోని బసవమ్మవాగు వద్ద నిలిచిపోయాయి. రాజపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. సత్తెనపల్లి నుంచి నరసరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రహదారులు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి.