ప్రాథమిక చికిత్స కేంద్రాలుగా ఆర్ఎంపి క్లినిక్లు..
Published Saturday, 24 September 2016అనంతపురం, సెప్టెంబర్ 23 : ఆర్ఎంపి క్లినిక్లు ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(ప్రైమరీ హెల్త్ సెంటర్స్)గా కొనసాగనున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన మెడికల్ కోర్సులు చదవని వారు సైతం ఆస్పత్రుల పేరుతో బోర్డులు పెట్టి క్లినిక్లు నడుపుతూ ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నట్లు జిల్లాధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే జిల్లాలో డెంగ్యూ ప్రబలిన నేపథ్యంలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థ పరిధిలో ఆర్ఎంపిల క్లినిక్లను ఈనెల 17 నుంచి మూసివేయించారు. దీంతో శుక్రవారం జిల్లా ఆర్ఎంపిల సంఘం ప్రతినిధులు శుక్రవారం జెసి-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణను కలిసి ప్రజారోగ్య పరిరక్షణ అంశంలో తమ తప్పులను అంగీకరించారు. ఇకనుంచి తాము డాక్టర్లు, ఆస్పత్రుల పేర్లతో బోర్డులు పెట్టుకోమని రాతపూర్వకంగా రాసిచ్చారు. అయితే ప్రథమ చికిత్స కేంద్రం (ప్రైమరీ హెల్త్ సెంటర్)గా నడుపుకోవడానికి తమకు అనుమతివ్వాలని ఆర్ఎంపిల సంఘం విజ్ఞప్తి చేసింది. దీంతో జెసి-1, డిఎంఅండ్హెచ్ఓ సంఘం నాయకులతో చర్చించి తాము విధించిన షరతులకు లోబడి కేవలం ప్రాథమిక చికిత్స కేంద్రాలుగా నడుపుకునే ఆర్ఎంపిలను మాత్రమే పరిశీలించి అనుమతిస్తామన్నారు. ఇకపై ఆర్ఎంపిలు డాక్టర్, ఆస్పత్రి అనే పేర్లుపెట్టకోకూడదు. ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే బోర్డు పెట్టుకోవాలని ఆదేశించారు. అలాగే రోగులకు ఎలాంటి రోగ నిర్ధారణ పరీక్షలు చేయరాదు.. రాయరాదని, ఇంజక్షన్లు, ఐవి ఫ్లూయిడ్స్, స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్, నిషేధిత మందులు, మాత్రలు ఇవ్వడం చేయరాదని, అడ్మిషన్లు చేసుకోరాదని, సీరియస్ రోగులకు ఎమర్జెన్సీ వైద్యం అందించరాదని షరతులు విధించారు. వీటన్నింటిని ఒక బోర్డుపై స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాసి వారు నిర్వహించే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ముందు ప్రజలందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాంటి వారికి మాత్రమే అనుమితిస్తామన్నారు. రోగులకు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, ఏవైనా స్వల్పగాయాలతో వచ్చే వారికి కట్టు కట్టవచ్చన్నారు. అలాగే రోగులకు వ్యాధులు రాకుండా సలహాలు,సూచనలు, అవగాహన కల్పించవచ్చన్నారు. ప్రథమ చికిత్స అనంతరం రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి ఉచితంగా చికిత్స చేయించుకునే విధంగా సలహాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆర్ఎంపిలు ఎవరైనా షరతులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలు ఎవరైనా షరతులు ఉల్లంఘించే వారిపై డిఎంఅండ్హెచ్ఓకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ మేరకు ఆర్ఎంపిల సంఘం ప్రతినిధులు అన్ని షరతుల్ని అంగీకరిస్తూ, ఇకపై ఎలాంటి తప్పులు చేయబోమని అంగీకారం తెలుపుతూ రాతపూర్వకంగా రాసి ఇచ్చారు.