నేర్చుకుందాం
Published Saturday, 24 September 2016చ. ‘అనిల జవంబునం బఱచు నమ్మదనాగ మెదిర్చి క్రమ్మఱిం
చిన పరికాఁడ పోలెఁ గురుసింహవరూధము నిట్లు గ్రమ్మరిం
చునె యితఁ’డంచునుం దగిలి చూపఱు సాల్వ మహీశు విక్రమం
బొనరఁగ నల్గడం బొగడుచుండిరి విస్మయసక్తచిత్తులై
భావం: ‘వాయువేగంతో పరుగెత్తే మదించిన ఏనుగును ఎదురించి మళ్ళించే తెగకు ముఖ్యమైన ఏనుగువలె కురుశ్రేష్ఠుడైన భీష్ముడి సైన్యాన్ని ఈ విధంగా ఇతడు మళ్లించాడే’ అంటూ ఆసక్తితో చూచేవారు ఆశ్చర్యంతో నిండిన మనస్సులతో సాల్వభూపతి పరాక్రమాన్ని నాల్గుదిక్కులా పొగడుతూ ఉండిపోయారు. భీష్ముడు బాసచేసి కాశీరాజు కుమార్తెలను తీసుకొని వెళ్తుండగా సాల్వరాజు భీష్మునిపై కోపగించి తాను పోరాటం చేస్తాన్ననాడు. అంతేకాక అందరూ విస్మయం చెందేటట్లుగా తన బాహుపరాక్రమాన్ని ప్రదర్శిస్తూ బాణాలను వేయసాగాడు. భీష్ముడు కూడా తన రథాన్ని వెనక్కుతిప్పి ప్రళయకాలంలో యముడి వలె భయంకరంగా సాల్వభూపతిని ఎదురించాడని నిశ్చయించుకొన్నాడు.
శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము