కడగండ్ల వరద
Published Saturday, 24 September 2016ఆంధ్రావని జల దిగ్బంధంలో చిక్కుకుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రెండు రోజుల పాటు కురిసిన కుంభవృష్టి ప్రభావం రాష్ట్రాన్ని వరద పాలు చేసింది. పల్నాడు ప్రాంతంలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. వరద నీటికి గ్రామాలకు గ్రామాలే నీట మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంట నీటి పాలైంది. ప్రకాశం బారేజీ నిండిపోవడంతో శుక్రవారం లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. రహదారులు దెబ్బతినడంతో రవాణా కుదేలైంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజుపాలెం సహా ఏడు మండలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అమరావతి మండలం పెదమద్దూరు వద్ద కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కుప్పగంజి వాగు వరద కారణంగా వెయ్యి కటుంబాలు నిరాశ్రయమయ్యాయి. సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో మూడు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ వరదలకు ధ్వంసమైంది. దీనితో ఫలక్నుమా, అమరావతి సహా పలు రైళ్లు రద్దయ్యాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50వేల హెక్టార్ల పైర్లు తుడిచిపెట్టుకు పోయాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో వాగులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వందలాది ఎకరాల పంట నీట మునిగిపోయింది. రాజానగరం-అనపర్తి రహదారి నీట మునిగిపోయింది. గ్రామాల్లోనే కాదు ఇళ్లల్లోకి మూడడుగుల మేర నీళ్లొచ్చేశాయి. భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాల్లో ప్రజల్ని అప్రమత్తం చేశారు. కినె్నరసాని గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేశారు.
చిత్రం.. చిలకలూరిపేట - గణపవరం మధ్య కోతకు గురైన రోడ్డు