జయకు అస్వస్థత
Published Saturday, 24 September 2016చెన్నై, సెప్టెంబర్ 23: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జ్వరంతో బాధపడుతుండటంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జ్వరం తగ్గుముఖం పట్టిందని, సాధారణ ఆహారం తీసుకుంటున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి ప్రతినిధి సుబ్బయ్య విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, జయ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ్సామి ట్వీట్ చేశారు. ఇదిలావుండగా, జయలలితకు ఆరోగ్యం చేకూరాలని ఎఐడిఎంకె నాయకులు, కార్యకర్తలు, భాగస్వామ్య పక్షాల కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా ప్రత్యేక పూజలు జరిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తమిళిసాయ్ సౌందరరాజన్ సహా స్థానిక పార్టీల నేతలు శరత్కుమార్, కె.వీరమణి తదితర నాయకులు జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.