వెంటనే వెళ్లిపోండి!
Published Saturday, 24 September 2016ముంబయి, సెప్టెంబర్ 23: జమ్మూకాశ్మీర్లోని యూరి సెక్టార్లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన ఫావద్ ఖాన్ వంటి కళాకారులు తక్షణమే భారత్ను వదలిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) శుక్రవారం డిమాండ్ చేసింది. లేకుంటే వారి షూటింగ్లను అడ్డుకుంటామని హెచ్చరించింది. మహిరా ఖాన్, ‘ఆయే దిల్ హై ముష్కి’ స్టార్ ఫావద్ ఖాన్ వంటి పాకిస్తాన్కు చెందిన కళాకారులు భారతీయ కళాకారుల అవకాశాలను కొల్లగొడుతున్నారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే భార్య శాలిని థాకరే శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. పాకిస్తాన్కు చెందిన ఈ ఇద్దరు నటులకు తక్షణమే భారత్ను వీడిపోవాలని అల్టిమేటం జారీ చేసినట్లు ఆమె చెప్పారు.
అయితే ముంబయి పోలీసులు మాత్రం భయపడవలసిన అవసరం లేదని, తగిన భద్రత కల్పిస్తామని ఈ ఇద్దరు నటులకు హామీ ఇచ్చారు. తమ పార్టీ ‘్ఛత్రపత్’ విభాగం 48 గంటలలోగా దేశాన్ని వీడి పోవాలంటూ పాకిస్తాన్ కళాకారులందరికి అల్టిమేటం జారీ చేసిందని ఎంఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి కూడా అయిన శాలిని థాకరే వెల్లడించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, అందువల్ల ఆ దేశానికి చెందిన కళాకారులు భారత్లో నటనా వృత్తిని మానుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై తాము ఇదివరకే పాకిస్తాన్ కళాకారులందరికి లేఖలు రాసే పనిని మొదలు పెట్టామని చెప్పారు. భారత్లో ఎంతో మంది కళాకారులు ఉన్నారని, వారిలో చాలా మంది అవకాశాలు లేక అల్లల్లాడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు చెందిన నటులకు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని ఆమె భారతీయ నిర్మాతలను ప్రశ్నించారు. తాము ఈ విషయమై నిర్మాతలకు లేఖలు రాస్తామని ఆమె చెప్పారు. పాకిస్తాన్ కళాకారులు భారత్ను వీడిపోకుంటే ఏం చేస్తారని ప్రశ్నించగా, ‘మా కార్యకర్తలు వారిని తోసివేస్తారు.. వారి నటనా వ్యాపారాన్ని ఇక్కడ కొనసాగనివ్వరు’ అని శాలిని థాకరే బదులిచ్చారు.