సహాయ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం
Published Saturday, 24 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 23: వర్షం, వరదలతో తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజలు తల్లడిల్లుతుంటే సహాయక కార్యక్రమాలు సకాలంలో చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విపక్షాల నేతలు మండిపడ్డారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ నగరంలో వర్షంతో జలమయమైన వివిధ ప్రాంతాలను శుక్రవారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఆశించిన విధంగా సేవలు అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం అంత పటిష్టంగా లేదని, బాధితులను సకాలంలో ఆదుకునే పరిస్థితి లేదని అన్నారు. హుస్సేన్ సాగర్ నీటిని విడుదల చేసినప్పుడు లోతట్టు ప్రాంతాలైన అశోక్ నగర్ నాలాకిరువైపుల ఉన్న ప్రాంతాలను, అంబర్పేట వాసులను అప్రమత్తం చేయలేదని ఆయన ఉదహరించారు. నిజాంపేట వాసులను ఆదుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఇలాఉండగా తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ ప్రభృతులు వర్షంతో ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాలను సందర్శించారు. షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా, వర్షంతో జంట నగరాలు జలమయమైతే, తెలంగాణ ప్రాంతమంతా వరదలతో అల్లకల్లోలమైతే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మకాం వేశారని విమర్శించారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తున్నదని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.