పెరుగుతున్న కృష్ణా నీటిమట్టం
Published Monday, 26 September 2016అవనిగడ్డ: కృష్ణానదికి వరద నీరు విడుదల కావటంతో మండల పరిధిలోని తీరగ్రామాల నదిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మండలంలోని కృష్ణానది పరీవాహక గ్రామాలను ఆదివారం సందర్శించారు. రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు గ్రామస్తులను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతానికి లక్షా 41వేల క్యూసెక్కుల నీరు విడుదల కావటంతో నీటి ప్రవాహ వేగం ఆదివారం రాత్రికి పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులు, ఉద్యోగులు పాత ఎడ్లలంక, పులిగడ్డ, వేకనూరు, దక్షిణ చిరువోల్లంక గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా పాత ఎడ్లలంక రేవును బుద్ధప్రసాద్ పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.