వస్రూరాంనాయక్ తండాలో అతిసార
Published Monday, 26 September 2016నాగర్కర్నూల్, సెప్టెంబర్ 26: బిజినేపల్లి మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని వస్రూరాంనాయక్ తండాలో ఆదివారం రాత్రి నుంచి కలుషితమైన నీటితో అతిసార వ్యాది వ్యాపించింది. సోమవారం తెల్లవారుజామున వాంతులు, విరేచనాలతో ఆ తండాకు చెందిన రాత్లావత్ దాసు(50) అనే వ్యక్తి మృతి చెందగా, దాదాపు 30 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా వారిని బిజినేపల్లి పిహెచ్సిలోను, పరిస్థితి విషమంగా ఉన్న వారిని నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రిలోను చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వరుసగా కురుస్తున్న వానలతో తండాలో సరఫరా అవుతున్న నీరు కలుషితం కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని తండా వాసులు తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి తండాకుచెందిన వారిలో చాలా మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, సిబ్బంది హుటాహటీన తండాకు వెళ్లి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.