వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండాలి
Published Monday, 26 September 2016నాగర్కర్నూల్, సెప్టెంబర్ 26: ప్రస్తుతం కురుస్తున్న వానలతో దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉన్నారని జెడిఎ శ్రీచరిత అన్నారు. సోమవారం ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను రాష్ట్ర అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఎంగంపల్లి, మల్కాపూర్ తదితర గ్రామాలలో నీటమునిగిన పంటలను పరిశీలించగా, ఏరువాక జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ వాటిని రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షణ గురించి రైతులకు వివరించారు. స్థానిక ఎడిఎ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జెడిఎ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వానలతో వర్షాధార పంటలకు ప్రయోజనం కలుగుతుందని, మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగినప్పటికి పత్తి, కంది తదితర పంటలకు ఈ వానలతో ప్రయోజనం ఉంటుందన్నారు. అక్కడక్కడ వరదనీటితో కొంత పంట నష్టం జరిగినప్పటికి, ఎండవస్తే ఆ పంటను కాపాడుకోవచ్చని అన్నారు.