‘ముంపు’పై కలెక్టర్ ఆరా
Published Tuesday, 27 September 2016ఏటూరునాగారం, సెప్టెంబర్ 26: ఎగువ ప్రాంతాలలో గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులు నిండడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. దీంతో జిల్లాలోని ఏజన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం మండలం కేంద్రంలోని ఓడగూడెం, మానసపల్లి, హరిజన కాలనీ లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేపట్టారు. ఆదివారం ఏటూరునాగారంలో బసచేసిన కలెక్టర్ సోమవారం ఉదయం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడారు. ప్రజలు అధికారులకు సహకరించి, ముంపునకు గురయ్యే ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని, పశువులను సైతం విడిచి పెట్టవద్దని సూచించారు. గ్రామస్థులు కరకట్ట బలహీనంగా ఉందని, మరమతులు చేపట్టాలని విన్నవించగా, వెంటనే కరకట్టకు మరమతులు చేపట్టాలని ఆర్డీవో మహేందర్కు సూచించారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల, బిసి, హాస్టల్లో ముంపు బాధితులకు నివాస, భోజన, వైద్య సౌకర్యం అందించేలా చర్యలు చేపట్టారు. ఆమెవెంట జిల్లా ఎస్సీ కిషోర్ఝా, ఐటిడిఎ పిఒ అమొయ్కుమార్, ములుగు ఆర్డీఒ మహేందర్జీ, ఎస్సై నరేష్, తహశీల్దార్ నరేందర్ ఉన్నారు.