మార్చినాటికి స్వచ్ఛ గజపతినగరంగా మారుస్తా
Published Monday, 21 November 2016గజపతినగరం, నవంబర్ 21: వచ్చే ఏడాది మార్చినాటికి స్వచ్ఛ గజపతినగరంగా మారుస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు హామీ ఇచ్చారు. సోమవారం గజపతినగరం దిగువ వీధిలో జన చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్య ఉండేదని వ్యాపారులు, పెద్దలు సహకారంతో పరిష్కారించామని చెప్పారు. అదే విధంగా జాతీయ రహదారి అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసారని, వాటి పనులు త్వరతగతిన చేపడతామని అన్నారు. స్వచ్ఛ గజపతినగరంగా ఇంకా మార్చాల్సి ఉందని దీనికి అందరి సహకారం అవసరమని అన్నారు. గజపతినగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. అందరి అభివృద్ధిగా చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. గజపతినగరానికి బైపాస్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంతోపాటు మంచినీటి సమస్య పరిష్కరించాలని, అర్హులకు పింఛన్లు, రహదారుల నిర్మాణం చేపట్టాలని గ్రామానికి చెందిన కంది ముసలినాయుడు, బూర్లిరాము, మహిళలు నాయుడును డిమాండ్ చేసారు. ముఖ్యంగా బోరు నుండి ట్యాంక్కి మంచినీరు సరఫరా జరుగుతున్నప్పటికీ 40 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్లు పాడైపోవడంతో నీరు కలుషితం అవుతున్నదని చెప్పారు. తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. జడ్పీటిసి మక్కువ శ్రీధర్ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చంద్రన్న బీమా ప్రవేశపెట్టి అసంఘటిత రంగ కార్మికులను ఆదుకుంటున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఎంపిపి గంట్యాడ శ్రీదేవి మాట్లాడుతూ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబుకు అందరం సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావి శ్రీధర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కనకల పోలినాయుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, గ్రామ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మి, ఎంపిటిసిలు కర్రి శ్రీదేవి, నగర ప్రసన్న కుమారి, టిడిపి నాయుకులు బుద్దరాజు రామ్జీ, నరవ శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.