ప్రెషర్ బాంబు పేలి జవాన్కు గాయాలు
Published Wednesday, 23 November 2016భద్రాచలం, నవంబర్ 22: తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలే లక్ష్యంగా మంగళవారం ఉదయం ప్రెషర్బాంబును పేల్చారు. ఈ ఘటన మారాయిగూడెం-గొల్లపల్లి గ్రామాల మధ్య జరిగింది. సుక్మా జిల్లా లింగంపల్లిలోని 217 సిఆర్పిఎఫ్ బేస్క్యాంపునకు చెందిన జవాన్లు మారాయిగూడెం-గొల్లపల్లి గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి పహారా కాస్తున్నారు. దీంతో వీరిని కదలికలను గమనించిన మావోలు ప్రెషర్బాంబును అమర్చారు. నిర్మాణ పనుల వద్దకు మంగళవారం పహారా కాయడానికి వచ్చిన జవాన్ ప్రభాకర్ యాదవ్ బాంబుపై కాలు పెట్టడంతో ఒక్కసారిగా అది పేలిం ది. కుడికాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
చిత్రం.. గాయపడ్డ జవాన్ ప్రభాకర్యాదవ్