అత్యవసర క్లాజ్తో భూసేకరణ తగదు
Published Wednesday, 23 November 2016హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 2013 భూసేకరణ చట్టంలోని అత్యవసర క్లాజును ఉపయోగించి ఇప్పటికిప్పుడు భూమిని సేకరించే పరిస్థితి లేదని, నాలుగు వారాలపాటు ఈ క్లాజును ఉపయోగించి భూములను అధీనంలోకి తీసుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణ్తో కూడిన ధర్మాసనం జారీ చేసింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బి పవన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది రచన వాదనలు వినిపిస్తూ, 2013 భూసేకరణ చట్టం కింద అర్జన్సీ క్లాజును ఉపయోగించి భూములను సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంల విషయంలో భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని, ఈ ప్రాజెక్టులు పూర్తికావడానికి 15 సంవత్సరాలు పడుతుందన్నారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది మహేందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. ఈ మేరకు రెండు వారాల గడువును హైకోర్టు ఇచ్చింది. కాగా అత్యవసర క్లాజు కింద భూమిని నాలుగు వారాల పాటు సేకరించరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.