రంగంలోకి సైబర్ వారియర్స్
Published Wednesday, 23 November 2016హైదరాబాద్, నవంబర్ 22: సైబర్ దాడులను అడ్డుకోవడానికి సైబర్ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. నగరంలోని హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీపై మంగళవారం జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీపై నూతన పాలసీని రూపొందించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
సైబర్ అటాక్ అనేది సర్వసాధారణంగా మారిందని, సంస్థలు, వ్యక్తులు, దేశాలకు ఈ సమస్య తప్పడం లేదని కెటిఆర్ అన్నారు. అజ్ఞాత వ్యక్తులు చేసే సైబర్ దాడులను కనిపెట్టడం కష్టమైన పని అని, ఈ ప్రమాదాన్ని గ్రహించే దేశంలో తొలిసారిగా సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకు వచ్చినట్టు తెలిపారు.
సైబర్ అటాక్స్ను ఎదుర్కోవడానికి సైబర్ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, వీరికి తగిన శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు.
ఇజ్రాయిల్ కోన్ఫిడస్ సిఇఓ రామ్ లెవి మాట్లాడుతూ సైబర్ అటాక్ ప్రమాదాల గురించి సవివరంగా వివరించారు. నాస్కామ్ ఎండి, చైర్మన్ సిపి గుర్నానీ సైబర్ సెక్యూరిటీ బిజినెస్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఒక బిలియన్ వ్యాపారం ఉండగా, ఇది 35 బిలియన్లకు చేరుకుంటుందని చెప్పారు.
చిత్రం.. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీపై
మంగళవారం జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న మంత్రి కెటిఆర్