రాష్ట్రంలో కార్ల ఇంటీరియర్స్ కంపెనీ
Published Friday, 25 November 2016విజయవాడ, నవంబర్ 24: ఆటోమొబైల్ ఇంటీరియర్స్కు ప్రఖ్యాతిగాంచిన అంటోలిన్ ఇంజనీరింగ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం సమావేశమయ్యారు. ఆడి, మెర్సిడిస్ వంటి దిగ్గజ కార్లకు ఈ సంస్థ తయారు చేసిన ఇంటీరియర్ పరికరాలు వినియోగిస్తున్నారు. పుణె, చెన్నైలలో ప్రస్తుతం ఆంటోలిన్ సంస్థకు తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమరావతిలో నూతనంగా తమ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి అంటోలిన్ ఇంజనీరింగ్ గ్రూప్ సుముఖంగా ఉంది.
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించి మేధా టవర్స్లో డిజైనింగ్ యూనిట్ ప్రారంభించాలని భావిస్తోంది. తొలుత 120 మందితో ప్రారంభించి 400 మంది వరకు దశలవారీగా ఉపాధి కల్పిస్తామని అంటోలిన్ ఇంజనీరింగ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్థానిక విశ్వవిద్యాలయాల్లో జర్మన్, స్పానిష్ భాషలను అభ్యసించేందుకు కోర్సులను ప్రవేశపెడితే సంబంధాలు బలోపేతం అవుతాయని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ఈ సందర్భంగా వివరించిన ముఖ్యమంత్రి, అంటోలిన్ గ్రూప్ తమ పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అమరావతిని ఎంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.