ఇకనుంచి ప్రజలతో ముఖాముఖి
Published Friday, 25 November 2016హైదరాబాద్, నవంబర్ 24: ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయం ‘ప్రగతి భవన్’ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం చేసే వేదికగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. ‘ప్రగతి భవన్’లో భాగంగా నిర్మించిన ‘జనహిత’ సమావేశ మందిరం ప్రభుత్వ ప్రథకాలు, విధానాల రూపకల్పనకు, కార్యక్రమాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయడానికి, ప్రజలతో ముఖాముఖి నిర్వహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలంటే గతంలో అందుకు అనువైన వసతి లేక హోటళ్ల చుట్టూ తిరిగేవారమన్నారు. ఇక నుంచి ఆ సమావేశాలను ‘జనహిత’ సమావేశ మందిరంలో నిర్వహించుకోవడంతో పాటు నిరంతరం వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ, పాలనా ఫలితాలు క్షేత్రస్థాయిలో అమలు కావడానికి కార్యాచరణ రూపొందిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రారంభం తర్వాత తన అధికార నివాసంలోని చాంబర్లో ప్రగతి భవన్, జనహిత మందిరం ఉద్దేశాలను ముఖ్యమంత్రి వివరించారు. సమాజంలో అనేక వర్గాల ప్రజలు వివిధ సమస్యలతో బాధపడుతుంటారని, ప్రభుత్వం వారితో నేరుగా మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, వృత్తి పనివాళ్లు ఇలా ప్రతీ వర్గంతో జనహితంలో ముఖాముఖి సమావేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. బాధితులను ప్రభుత్వ ఖర్చులతోనే హైదరాబాద్కు రప్పించి వారితో చర్చిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, ప్రభుత్వ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన పంథాను ఖరారు చేస్తామన్నారు. ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ విందులు, ఉగాది పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు తదితర అధికార కార్యక్రమాలన్నీ ఇకపై ప్రగతి భవన్లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.
chitram...
కొత్త క్యాంపు కార్యాలయం ‘ప్రగతి భవన్’లో గృహప్రవేశం అనంతరం ‘జనహిత’ సమావేశ మందిరంలో మంత్రులు, పార్టీ నేతలతో భేటీ అయన సిఎం కెసిఆర్