జంట నవలల సందేశాలు.. ముందు తరానికి ప్రబోధకాలు
Published Friday, 25 November 2016పునీతులు (నవల)
సప్తపది (నవల)
ప్రతులకు:
సుజలగంటి అనురాధ
7702319351
ధర- ఒక్కొక్కటి రూ.50/-
పిల్లల మనస్తత్వాల గురించి తెలుసుకోకుండా, మూర్ఖంగా ప్రవర్తించే తల్లిదండ్రుల కళ్లు తెరిపిస్తుంది ఈ కథనం. ‘పునీతులు’ నవల. పిల్లలవల్ల తమ కోర్కెలు తీర్చుకోవాలనుకోవడం తప్పు, పిల్లలకేం కావాలో తెలుసుకుని ప్రవర్తించడం, మన బాధ్యత అని ఒక చక్కటి కుటుంబ కథని, మంచిని విశే్లషిస్తూ, బాధ్యతలని గుర్తింపజేస్తు సాగుతుంది. తల్లిదండ్రుల, పిల్లల మనోభావాలను పట్టించుకోకపోతే ఎంత ప్రమాదమో వివరిస్తుంది. ఈ నవల చాలామందిని ఆలోచింపజేస్తుంది. కర్తవ్యాన్ని బోధిస్తుంది. (సుజలగంటి) అనురాధగారి కలంనుండి జాలువారిన ఒక ఉత్తమ నవల. స్వాతి మాస పత్రికలో ప్రచురించబడ్డ కథ. కవలల్లా ముద్దుగా (సుజలగంటి) అనూరాధగారి కలం నుండి జాలువారిన పునీతులు నవల, సప్తపది నవల రెండూ ఒకే సైజులో ముద్రింపబడి ముచ్చటగొలుపుతున్నాయి.
* * *
మన సంప్రదాయాలు, సంస్కృతీ అంతా మర్చిపోతూ, విదేశీ పోకడలను అనుసరిస్తున్న నేటి యువత, వివాహ వ్యవస్థకి ప్రాముఖ్యతను ఇవ్వకపోగా, చులకనగా కూడా చూస్తోంది. అందుకే కొత్త పోకడ సహజీవనం వైపు మొగ్గుచూపుతోంది. రెండు ఒకటే... వివాహ వ్యవస్థలో మంత్రాలు ఎంత అర్థవంతమైనవో తెలుసుకుంటే, జీవితంలో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది. మనుగడని మెరుగుపరుస్తుంది. అసలు జీవితమంటేనే సుఖ, దుఃఖాల మిశ్రమం కాదా? మన చుట్టు వున్న వారితో బంధువులూ, స్నేహితులూ ఇరుగుపొరుగులూ ఎవరైనా కావచ్చు వారితోనూ సర్దుబాట్లు చేసుకోక తప్పదుకదా! అటువంటప్పుడు భార్యాభర్తలు, చిన్నచిన్న కారణాలతో దెబ్బలాడుకుంటూ విడిపోవడం న్యాయమా? యువత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు బాగా ఆలోచించి తప్పులను దిద్దుకోవడం, వాడిన చెట్టుకి, మమత అనే నీరుపోసి, చుట్టూ సర్దుబాటు అనే గొప్పులు కట్టి సుఖపడడం తమకీ, తద్వారా వారి సంతతికీ, చివరగా సమాజానికీ కూడా ఎంతో ఉపయోగం- అవసరం కూడా! ఆ విషయాన్ని చక్కటి కథారూపంలో వివరించారు రచయిత్రి (సుజలగంటి) అనురాధగారు సప్తపది నవలలో. గ్రంథం ముచ్చటగా చేతిలో చిన్న పర్సు పట్టుకున్నట్టుగా మన బ్యాగ్లో వేసుకుని ఎప్పుడంటే అప్పుడు పైకి తీసి చదువుకునేలా వుంది. ఎమెస్కో పాకెట్ బుక్స్ సైజు చూశాం కానీ ఈ సైజు నవలలు చూడలేదు.