ఎం-పెసాతో నగదు
Published Saturday, 26 November 2016హైదరాబాద్, నవంబర్ 25: దేశంలోని దాదాపు 84 లక్షల మంది ఖాతాదారులకు నగదు ఉపసంహరణ కోసం వొడాఫోన్ ఇండియా వినూత్నమైన సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు తమ డిజిటల్ వాలెట్ను ఉపయోగించి దేశ వ్యాప్తంగా 1.20 లక్షల వొడాఫోన్ ఎం-పెసా ఔట్లెట్లలో లభ్యతను అనుసరించి నగదును విత్ డ్రా చేసుకోవచ్చని ఆ సంస్థ బిజినెస్ హెడ్ సురేష్ సేథీ తెలిపారు. వొడాఫోన్ ఎం-పెసా కస్టమర్లు ఎటిఎంలు, బ్యాంకు శాఖల వద్ద నగదు కోసం భారీ క్యూలలో నిల్చోవాల్సిన అవసరంలేదన్నారు. తమ సంస్థ ఔట్లెట్లు 56 శాతం గ్రామీణ భారతంలో ఉన్నాయన్నారు. తమ వాలెట్ను అత్యంత సులభంగా తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ను ఉపయోగించి లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ షాపింగ్ కోసం, బిల్లు చెల్లింపులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు నగదు బదిలీ చేయడానికి ఉపయోగించవచ్చునన్నారు. కస్టమర్లు తమ గుర్తింపు పత్రంతో తమ ఔట్లెట్ను సందర్శించాలన్నారు.